హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 7 గంటలకు తనతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఒక్క మ్యాచ్ కోసం ప్రభుత్వ పరంగా రూ. 100 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఓ వైపు విద్యా, వైద్య రంగాలను భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాగ్ లింగంపల్లి గురుకుల విద్యార్థులు 90 మంది కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలై నానా ఇక్కట్ల పాలవుతుంటే పట్టించుకున్న పాపాన పోలేదన్నారు . ఇదేనా సీఎంకు ఉన్న బాధ్యత అని ప్రశ్నించారు. ప్రజా పాలన పూర్తిగా గాడి తప్పిందని మండిపడ్డారు.
ఇంత జరుగుతున్నా , విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు హరీశ్ రావు. ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఆ పిల్లలను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. అందరూ ఫుట్ బాల్ ఆడడంలో బిజీగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. రూ.100 కోట్లతో ఫుట్ బాల్ ఆడేకంటే పిల్లలకు ఏదైనా మంచి హాస్టల్ కట్టి, కడుపు నిండా మంచి ఆహారం పెట్టొచ్చు కదా అని నిలదీశారు . సీఎంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడని, ఆయన ముఖ్యమంత్రి పదవి కంటే గుంపు మేస్త్రీగానే పనికి వస్తాడని , సరిగ్గా సరిపోతాడని సెటైర్ వేశారు. ఇకనైనా విద్యా రంగంపై దృష్టి సారించాలని హితవు పలికారు.


















