హైదరాబాద్ : మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ పాలన గాడి తప్పిందన్నారు. సోయి లేని సీఎం ఉండడం వల్లనే ఇదంతా చోటు చేసుకుందని మండిపడ్డారు. విచిత్రం ఏమిటంటే ఒక్క అధికారిని పట్టుమని పది నెలలు కూడా ఉండనీయడం లేదన్నారు. ఇలాగైతే ప్రజలకు ఎలా సర్వీస్ అందిస్తారని ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరి తెలంగాణ రాష్ట్రంలో రెండున్నర ఏళ్లు కావొస్తోందని , ఈ కాలంలో ఏకంగా 140 మంది ఐఏఎస్ లను బదిలీ చేశారని , ఇదెక్కడి పాలన అంటూ భగ్గుమన్నారు తన్నీరు హరీశ్ రావు.
ఆరు నెలలకు ఒక అధికారిని బదిలీ చేస్తే, వాళ్లు ఆ శాఖను అర్థం చేసుకునేది ఎప్పుడు పని చేసేది ఎప్పుడు? అని ఫైర్ అయ్యారు. విద్యుత్ శాఖలో 5, సింగరేణిలో 4 సీఎండీలు, ఐ అండ్ పీఆర్ శాఖలో 4, జీహెచ్ఎంసీలో 4, విద్యాశాఖ కమిషనర్లు 4, ఆరోగ్యశ్రీలో 8 మంది సీఈవోలు, మున్సిపల్ శాఖలో 5, ఐటీలో 3, మైనింగ్ శాఖలో 6, నేషనల్ హెల్త్ మిషన్ 3, రంగారెడ్డి జిల్లాలోనే నలుగురు కలెక్టర్లను బదిలీ చేశారని ఏకరువు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ను ఏకి పారేశారు. ఇకనైనా ఇలాంటి చిల్లర నిర్ణయాలకు స్వస్తి పలకాలని , పాలనపై పట్టు సాధించాలని హితవు పలికారు.



















