Govindaraja Swami : తిరుపతి – తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని శ్రీ గోవింద రాజ స్వామి (Govindaraja Swami) వారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Govindaraja Swami Grand Commencement
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి కైంకర్యాలు శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు. ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు.
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు తరలి వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, ఏఈవో ముని కృష్ణారెడ్డి, అర్చకులు, తదితర అధికారులు పాల్గొన్నారు.
Also Read : Tholi Ekadashi 2025 Interesting Facts : తొలి ఏకాదశి విశిష్టత ఏమిటో తెలుసుకుందామా


















