తిరుపతి : చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్లలోని శ్రీ కోనేటి రాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 24 నుండి మే 03వ తేదీ వరకు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల ప్రారంభానికి ముందు ఏప్రిల్ 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఏప్రిల్ 23న సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలు జరుగుతాయి.
ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు భక్తులను అలరించనున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం ధ్వజారోహణం (మిథున లగ్నంలో ఉ. 9.05 నుండి 9.15 వరకు) సాయంత్రం శేష వాహనం, 25వ తేదీన ఉదయం తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం హంస వాహనం, 26న ఉదయం సింహ వాహనం, సాయంత్రం ముత్యపు పందిరి వాహనం, 27న ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వ భూపాల వాహనం, 28న ఉదయం మోహినీ ఉత్సవం, సాయంత్రం కల్యాణోత్సవం, గరుడ వాహనం, 29న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం వసంతోత్సవం, గజ వాహనం, 30న ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం జరుగుతుందని తెలిపింది టీటీడీ.
ఇక మే 1వ తేదీన ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వ వాహనం, 2వ తేదీన ఉదయం చక్రస్నానం,
సాయంత్రం ధ్వజావరోహణం జరుగుతుంది. ఏప్రిల్ 28న సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి ఇద్దరు భక్తులు పాల్గొనవచ్చు. పాల్గొనే వారికి ఉత్తరీయం, రవికె, అన్న ప్రసాదం అందజేస్తారు. మే 03న సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు భక్తి సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించ బడతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
