అమరావతి : ఏపీ సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. ఇవాళ క్రిస్మస్ పండుగ సందర్బంగా నిన్ననే క్రిష్టియన్ పాస్టర్లకు వారి ఖాతాల్లో వేతనాలను జమ చేసింది. పండుగ సందర్బంగా ఇబ్బందులు ఉంటాయని ముందే గుర్తించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు వారికి 24వ తేదీననే వారి ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని సీఎస్ విజయానంద్ ను ఆదేశించారు . ఇందులో భాగంగా క్రిస్టియన్ పాస్టర్లకు నెలవారీ అందించే గౌరవ వేతనాలను జమ చేసింది. ఇదిలా ఉండగా సాయంత్రం లోపు గౌరవ వేతనాలు చెల్లిస్తామని సెమీ క్రిస్మస్ రోజున ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని 8,418 మంది పాస్టర్లకు నిధులు విడుదల చేశారు. 2024 డిసెంబర్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం రూ.50.50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ల ఖాతాలో వేసింది. దీంతో ఒక్కో పాస్టర్కు నెలకు రూ.5,000 చొప్పున ఒకొక్కరికి 12 నెలల మొత్తం రూ.60,000 అందించింది.
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు, పది సూత్రాల అమలుపై నారా చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం, తక్కువ వ్యయంతో ఇంధనం ఉత్పత్తి, విద్యుత్, రవాణా, నీటి భద్రత అందించటం లక్ష్యంగా ప్రణాళికల రూపకల్పన, జీరో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సాంకేతికత మేళవింపు తదితర అంశాల ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. సుస్థిరాభివృద్ధితో పాటు స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు కావాల్సిన, నిర్దేశించుకోవాల్సిన అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, జలవనరులు, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఆర్ధిక, వైద్యారోగ్య, రవాణా, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన, పురపాలక, ఐటీ తదితర శాఖల ఉన్నతాధికారులు సమావేశం లో పాల్గొన్నారు.
















