న్యూఢిల్లీ : కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. కేంద్ర రైల్వే శాఖకు ధన్యవాదాలు తెలిపారు. తాను చేసిన అభ్యర్థనకు మంత్రి అశ్విని వైష్ణవ్ ఓకే చెప్పారని తెలిపారు. ఈ సందర్బంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు శుభవార్త చెప్పారు. ఎంతోకాలంగా చేసిన ప్రయత్నాల ఫలితంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణించే మూడు ముఖ్యమైన రైళ్లకు ఇప్పుడు కీలక స్టేషన్లలో రైల్వే శాఖ హల్ట్ లు మంజూరు చేశారని పేర్కొన్నారు.
58505/06 గుణుపూర్–విశాఖపట్నం ప్యాసింజర్ రైలు ఇకపై హరిశ్చంద్రపురం వద్ద, 1825/26 బెరహంపూర్–విశాఖపట్నం ప్యాసింజర్ రైలు మందస రోడ్ వద్ద, 18117/18 రాజ్య రాణి ఎక్స్ప్రెస్ రైలు పాతపట్నం వద్ద ఆగుతాయని వెల్లడించారు. ఈ హల్ట్ ల ద్వారా జిల్లాలోని అంతర్గత ప్రాంతాలకు రవాణా సౌకర్యం , విశాఖపట్నం వంటి ప్రధాన పట్టణాలకు విద్య, వైద్యం, ఉపాధి , వ్యాపార అవసరాల కోసం ప్రయాణం మరింత సులభమవుతుందని తెలిపారు రామ్మోహన్ నాయుడు.
తమ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ కొత్త స్టాపేజీల ద్వారా జిల్లాలోమెరుగైన రైల్వే కనెక్టివిటీ, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త అవకాశాలను తీసుకు వస్తుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ప్రాంతానికీ అభివృద్ధి చేరేలా మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా ఇది మరో ముఖ్యమైన అడుగు అని అన్నారు.
















