Gold : దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి ఆకాశాన్ని తాకాయి. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన పసిడి ధరలు, శనివారం ఒక్కరోజే పెద్ద ఎత్తున పెరగడం గమనార్హం.
ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (Gold) ధర రూ.1,01,620 వద్ద నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,150కి చేరింది. అంతేకాకుండా, 18 క్యారెట్ల పసిడి ధర రూ.76,214 వద్ద కొనసాగుతోంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. దేశంలోని కొన్ని మార్కెట్లలో కిలో వెండి ధర రూ.2,000 వరకు పెరిగి, ప్రస్తుతం సగటున రూ.1,20,000 వద్ద కొనసాగుతోంది. చెన్నై, హైదరాబాద్, కేరళ వంటి రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.1,30,000కి చేరింది.
Gold – బంగారం కొనుగోలు ముందు ధరలను తప్పక తెలుసుకోండి
పసిడి కొనుగోలు చేయబోతున్న వినియోగదారులు తమ ప్రాంతంలోని ఆభరణాల దుకాణాల్లో ధరలను పరిశీలించడం లేదా నేరుగా వ్యాపారులను సంప్రదించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మారుతున్న ధరల నేపథ్యంలో తాజా రేట్లు తెలుసుకోవడం అత్యంత అవసరం.
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా బంగారంపై డిమాండ్ పెరుగుతోంది. అనేక దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రముఖ పెట్టుబడిదారులు బంగారాన్ని వేగంగా కొనుగోలు చేస్తున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్లలోనూ బంగారంపై పెట్టుబడులు పెరిగాయి. ముఖ్యంగా చైనా కేంద్ర బ్యాంకు వరుసగా బంగారం నిల్వలను పెంచుతోంది.
ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు కూడా బంగారం ధరల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తక్కువ వడ్డీ రేట్లు, ఆర్థిక అస్థిరత వంటి పరిస్థితుల్లో బంగారం పెట్టుబడికి భద్రతగా మారుతుందన్న విశ్వాసం పెరిగింది.
పెట్టుబడిదారులకు పసిడి ఆకర్షణగా
ఈ నేపథ్యంలో బంగారం ఇప్పుడు పెట్టుబడిదారుల మొదటి ఎంపికగా మారినట్టు తెలుస్తోంది. ధరలు పెరిగినా, స్థిరమైన రాబడికి ఇది భరోసా అని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వచ్చే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులను బట్టి బంగారం ధరల్లో మరింత ఊగిసలాటలు ఉండే అవకాశముంది.
Also Read : Today Gold Price : రోజురోజుకు పతనమవుతున్న పసిడి ధరలు



















