హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ జాగృతి సంస్థ పార్టీగా మారబోతోందని ప్రకటించారు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తనకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున జాగృతి కార్యాలయానికి తరలివచ్చిన ఉద్యమకారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల బాధ్యులు, జాగృతి కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు వారిని ఉద్దేశించి. ఎప్పుడైతే ఉద్యమ ద్రోహులు బీఆర్ఎస్ పార్టీలో చేరారో అప్పటి నుండి తెలంగాణ కోసం పోరాటం చేసిన లక్షలాది మంది ఉద్యమకారులకు టీఆర్ఎస్ లో ఇసుమంత కూడా గౌరవం దక్కకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కల్వకుంట్ల కవిత. వేలాదిగా పోస్టులు ఉన్నా సరే వారికి పదవులు ఇవ్వాలని గుర్తుకు రాకపోవటం విచారకరం అన్నారు.
ఉద్యమంలో వేలాది మంది ఆడబిడ్డలు పనిచేస్తే వారికి అవకాశాలే రాలేదని మండపడ్డారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ బాస్ ను కూడా ఏకి పారేశారు. తన తండ్రినని చూడకుండా ఆమె కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాలలో కలకలం రేపింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జాగృతి పొలిటికల్ పార్టీగా ఎదుగుతుందని స్పష్టం చేశారు కవిత. తెలంగాణ ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తూ ఒక శక్తిగా మారడం ఖాయమని జోష్యం చెప్పారు. లెఫ్ట్ పార్టీల సోదరులు, మావోయిస్టు సానుభూతి పరులు, మనుగడ కొనసాగించలేకపోతున్న మావోయిస్టులు, ప్రజాస్వామ్య పద్దతిలో పనిచేసే పార్టీ రావాలనుకుంటున్న వారు తనకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.
