హైదరాబాద్ : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. మంత్రుల రాసలీలపై వస్తున్న ప్రచారం పట్ల తీవ్రంగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తమపై లేనిపోని విధంగా నీచాతినీచంగా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారంటూ మండిపడ్డారు. ఇవాళ తమలో తాము ఆరోపణలు చేసుకోవడం, చివరకు వివిధ ఛానళ్లలో తమ బండారం గురించి పుంఖాను పుంఖానులుగా కథనాలు ప్రసారం అవుతున్నాయని , వీరి నిర్వాకం చూస్తే సిగ్గుతో తలదించు కోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు జగదీశ్ రెడ్డి. కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు వస్తే తప్ప స్పందించరా అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది మీ వాళ్లే కాదా అని నిలదీశారు. మంత్రులను లక్ష్యంగా చేసుకుని వారిపై నిరాధారమైన వార్తలు రాయిస్తున్నది, ప్రసారం చేయిస్తున్నది రేవంత్ రెడ్డి కాదా అని మండిపడ్డారు.
కేటీఆర్ మీద మంత్రులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి వాళ్ల కుటుంబాల్లో ఇబ్బంది పెట్టేలా చేశారని, దానిని ప్రజలు ఎలా మరిచి పోతారని అన్నారు. ఈ సంస్కృతి రేవంత్ రెడ్డే ప్రారంభించాడని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు పిచ్చి రాతలు రాయించినప్పుడు సోయి లేదా అని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు వస్తే మీకు బాదైతుందా అని పేర్కొన్నారు జగదీశ్ రెడ్డి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మొదటి నుంచి చేస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకుంటే బాగుండేదన్నారు. మంత్రులపై ఆరోపణలు వచ్చాయని పై స్థాయి అధికారులు స్పందిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో పదేండ్లు ఇటువంటి ఘటనలు జరగ లేదన్నారు. గాంధీ భవన్, సీఎం ఆఫీస్ నుంచి ఘోస్ట్ సైట్లు పనిచేస్తున్నాయని ఆరోపించారు.















