హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజా పాలన సాగడం లేదని, రాచరిక ప్రభుత్వం కొనసాగుతోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లోని తలంగాణ భవన్ లో తన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత తక్కలపల్లి రవీందర్ రావు. దీంతో నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు తను. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు రవీందర్ రావుకి ఘన స్వాగతం పలికారు.
రవీందర్ రావు గత పదేళ్లుగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్గా, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఆయన రెండుసార్లు ఎంపిపిగా , సింగిల్ విండో చైర్మన్గా పనిచేసి నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మోసపూరిత వైఖరిని నిరసిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఆయన బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.
ఈ చేరిక నర్సంపేట నియోజకవర్గ రాజకీయాల్లో, ముఖ్యంగా నర్సంపేట మున్సిపాలిటీ , ఖానాపురం మండలాల్లో బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండగా నిలుస్తుందని పెద్ది సుదర్శన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్న రవీందర్ రావు పార్టీలోకి రావడం శుభపరిణామమని, రాబోయే రోజుల్లో పార్టీ మరింత పటిష్టం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
