కరీంనగర్ జిల్లా : కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు పని చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ పార్టీలో హల్ చల్ చేస్తున్నాయి. పార్టీలో కొనసాగాలా వద్దా అనే దానిపై ఆలోచిస్తున్నానంటూ బాంబు పేల్చారు. పార్టీలో తన స్థానం ఏమిటో, తన భవిష్యత్ ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఇలా పార్టీలో ఉంటూ ఇంకెంత కాలం అవమానాలు భరించాలని ఆవేదన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. ఇవాళ తను మీడియాతో మాట్లాడారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఎన్నికలు ముగింపు కాదన్నారు. ఎమ్మెల్యేగా సంజయ్ ఉన్నంత కాలం తనకు వేధింపులు తప్పవని వాపోయారు .
ఈ సందర్బంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ హై కమాండ్ , సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ ఆఫ్ అటార్నీ ఎమ్మెల్యే సంజయ్కు రాసిచ్చారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జగిత్యాల కాంగ్రెస్ పట్టా ఇచ్చారా అధికారకంగా అంటూ భగ్గుమన్నారు. స్పీకర్ ఏమో ఎమ్మెల్యే పార్టీ మారలేదు అంటున్నాడు.. ఎమ్మెల్యే సంసారం మాత్రం కాంగ్రెస్ పార్టీతో చేస్తున్నాడంటూ నిప్పులు చెరిగారు. అధినాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు గౌరవించాలని అన్నారు. జగిత్యాలలో ఇలా ఉంటే పార్టీ మారిన మరో 9 ప్రాంతాల్లో ఎలా వుందో అంటూ పేర్కొన్నారు.
















