హైదరాబాద్ : అబద్దపు హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ఇష్టానుసారం పాలన సాగిస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఎవరిని ఒక చోట స్థిరంగా ఉంచడం లేదన్నారు. దీని వల్ల పనులకు ఆటంకం ఏర్పడుతుందని, అభివృద్ది కుంటు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. కీలకమైన శాఖలలో ఇప్పటి వరకు సీనియర్ అధికారులను స్థిరంగా ఉంచక పోవడం వల్ల చాలా ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యుత్ శాఖలో సైతం 6 నెలలు కాక ముందే మార్చారని, ఇక పట్టు ఎలా వస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రం పరంగా కేంద్రంతో నిధులు రాబట్టు కోవాలంటే తప్పనిసరిగా ఆయా శాఖలలో కొంత కాలం పాటైనా స్థిరంగా అధికారులను బదిలీ చేయకుండా ఉండాల్సి ఉంటుందన్నారు.
కానీ రేవంత్ రెడ్డి తన మీద తనకు నమ్మకం కోల్పోయి, ఇతరులను ఒక పట్టాన నమ్మడం లేదన్నారు హరీశ్ రావు. ఇది మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్రానికి ఒక శాపంగా మారింది సీఎం పాలన అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విద్యుత్ శాఖలో సైతం ఇష్టం వచ్చినట్లు మార్చడం ద్వారా అవినీతి మయం అయిందన్నారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ను 13 నెలలకే తీశారని అన్నారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ ను 8 నెలలకే మార్చారని, అసలు సోయి అనేది సీఎంకు ఉందా అన్న అనుమానం తనకు కలుగుతోందన్నారు. వరంగల్ కలెక్టర్ ను 6 నెలలకే మార్చారంటూ ఫైర్ అయ్యారు హరీశ్ రావు. ఇలా తక్కువ కాలానికే మార్చడం వలన వారు మానసికంగా ఇబ్బంది ఎదుర్కుంటారని పేర్కొన్నారు . ఐఏఎస్ లను మార్చడం వలన పరిపాలన దెబ్బ తింటుందని, ఆ విషయం సీఎం గ్రహిస్తే మంచిదని హితవు పలికారు.















