అమరావతి : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలు బయటకు వస్తున్నా ఎందుకు సీఎం చంద్రబాబు మౌనంగా ఉన్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు మాజీ సీఎం జగన్ రెడ్డి. బుధవారం ఆయన సీఎంకు సుదీర్ఘ లేఖ రాశారు. లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుకి అదే నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. నెయ్యి క్వాలిటీ బాగోలేదని ఈ చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా, మళ్లీ అవే క్వాలిటీలేని నెయ్యి ట్యాంకర్లు, ఆయన హయాంలోనే వేరేవారి పేరిట తిరిగి టీటీడీకి రావడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం, అక్కడ నుంచి తిరుమల లడ్డూ తయారీలో వాడడం, ఇదే విషయాన్ని సీబీఐ-సిట్ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జిషీటు 44వ పేజీలోనూ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. చంద్రబాబుకి దేవుడి పట్ల భక్తీ లేదు, ఆలయాల నిర్వహణపట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఈ రకంగా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరి మీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు 2014-19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278- రూ.330. 2019-24 మధ్య కూడా నెయ్యి సగటు రేటుకూడా దాదాపుగా అంతే ఉన్నాయని తెలిపాడు. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ తన హెరిటేజ్కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇందాపూర్ డెయిరీకి, కిలో నెయ్యి రూ.658లకు, 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టాడని ఆరోపించారు. లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారని మండిపడ్డారు.. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదన్నారు. శ్రద్ధ లేదు, నిష్ఠ లేదు, నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ అంటూ పేర్కొన్నారు.



















