అమరావతి : రాష్ట్రంలో గంగపుత్రులను నిట్ట నిలువునా మోసం చేసిన ఘనత మాజీ సీఎం జగన్ రెడ్డికే దక్కుతుందని మండిపడ్డారు రాష్ట్ర మత్స్య, వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. నిస్సిగ్గుగా మత్స్యకారుల ప్రమాద మరణ పరిహారాన్ని 10 లక్షలకు పెంచామని చెప్తున్న జగన్, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెండింగ్లో ఉన్న మత్స్యకారుల మరణ పరిహారాలైన 2024-25లో రూ.3.15 కోట్లు చెల్లించామని అన్నారు. అదే విధంగా 2025-26లో రూ.5.65 కోట్లు చెల్లించామని తెలిపారు. నీ ఇష్టానుసారంగా నీ పత్రిక, నీ మనుషులు చెప్పిన మాటలను చదవటం కాకుండా నిజాలను తెలుసుకుని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా అంటూ మండిపడ్డారు. మత్స్యకారుల కుటుంబాలకు న్యాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు.
సామాజిక భద్రతా పింఛనును రూ.3,000 నుండి రూ.4,000కు పెంచి, వేలాది మంది మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించామని అన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే భారీ మొత్తంలో నిధులు విడుదల చేశామని తెలిపారు. మత్స్యకారుల భద్రత కోసం ట్రాన్స్పాండర్లు అమర్చడం, కృత్రిమ రీఫ్ల ఏర్పాటు, చేప పిల్లల విడుదల, డీప్ సీ ఫిషింగ్ పడవల పంపిణీ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి వివరించారు. తీర ప్రాంత గ్రామాల అభివృద్ధి, ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం ద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తున్నామని చెప్పారు. జగన్ ప్రభుత్వం కేంద్ర నిధులను పక్కదారి పట్టించి మత్స్యకారులను మోసం చేసిందని ఆరోపించిన మంత్రి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.128 కోట్ల కేంద్రం వాటా బకాయిలను కేంద్రానికి చెల్లించి పారదర్శకతను నిరూపించామని తెలిపారు. నిజాలు దాచిపెట్టి అబద్ధాలు ప్రచారం చేయడం జగన్కు అలవాటై పోయిందని విమర్శించిన మంత్రి అచ్చెన్నాయుడు.
