అమరావతి : ఏపీని సీఎం నారా చంద్రబాబు నాయుడు అప్పుల కుప్పగా మార్చేశాడని సంచలన ఆరోపణలు చేశారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. పాలన పడకేసిందని, కేవలం ప్రచారం తప్పా ఆచరణలో ఎలాంటి పనులు కావడం లేదన్నారు. ఎన్నికల సందర్బంగా చెప్పిన హామీలు, సూపర్ సిక్స్ లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రతి ఇంటికీ వెళ్లి బాండ్లు ఇచ్చాడు. ఆ బాండ్ల మీద పవన్ కల్యాణ్ సంతకం, ఈయన సంతకం పెట్టారు. త్రికరణ శుద్ధితో మేం ఇద్దరం కలిసి ప్రమాణం చేస్తున్నాం, జూన్ 2024 నుంచి మీ ప్రతి ఇంటికీ ఇవన్నీ వస్తాయి అని ఏకంగా బాండ్లు ఇచ్చారు. ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలేదన్నారు జగన్ రెడ్డి.
మ్యానిఫెస్టో అన్నది మా హయాంలో ఒక భగవద్గీత కిందనో, బైబిల్ కిందనో, ఖురాన్ కిందనో భావిస్తూ 99 శాతం హామీలను నెరవేర్చాం అన్నారు. ప్రజల వద్దకు వెళ్లాం. తమకు ఓటు వేయాలని కోరాం. కానీ కూటమి నేతలు మాయమాటలు చెప్పి మోసం చేశారని ఆరోపించారు. కూటమి సర్కార్ తెచ్చిన మ్యానిఫెస్టోను ప్రజలు చెత్తబుట్టలో వేశారన్నారు. ఇక ఇవాళ అరాచక పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నంగా మారిందన్నారు. పథకాలన్నీ పడకేశాయని ఎద్దేవా చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్, సంక్షేమం, అభివృద్ధి.. ఇవన్నీ కూడా ఈరోజు తిరోగమనంలో కనిపిస్తున్నాయని అన్నారు జగన్ రెడ్డి.
