తిరుమల : టీటీడీలోని వివిధ విభాగాల్లో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన స్క్రాప్ తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు . తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో వివిధ విభాగాల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీలోని అన్ని విభాగాల్లో ఉన్న స్క్రాప్ ను గుర్తించి 15 రోజుల్లో రిపోర్ట్ అందించాలని అధికారులను ఆదేశించారు. ఆరు నెలలకు ఒకసారి ప్రతి విభాగంలో స్క్రాప్ తొలగింపునకు షెడ్యూల్ రూపొందించాలన్నారు. వేలం ద్వారా ఆ స్క్రాప్ ను ఎప్పటికప్పుడు విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అదేవిధంగా ఫీడ్ బ్యాక్ వ్యవస్థ అద్భుత ఫలితాలు ఇస్తోందని, దీనిని ఇదేవిధంగా కొనసాగించాలని చెప్పారు. భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలతో తిరుమలలో ప్రజా రవాణా, అన్న ప్రసాదం, పారిశుద్ధ్య సేవలు విశేషంగా మెరుగయ్యాయని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఎఫ్ఎంఎస్, కళ్యాణకట్ట, లగేజ్ సెంటర్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని అన్నారు.
భక్తులు విరాళాలు అందించేందుకు వీలుగా తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రిలో కూడా కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన పలు ఇంజినీరింగ్ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో సిఈ సత్య నారాయణ, ఇతర విభాగాధిపతులు, అధికారులు పాల్గొన్నారు.


















