వరంగల్ జిల్లా : సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, వ్యవస్థీకృత ముఠాల అదుపుపై పోలీసులు దృష్టి సారించాలని స్పష్టం చేశారు డీజీపీ సీవీ ఆనంద్. పోర్టల్ అప్డేషన్పై ప్రత్యేక మార్గదర్శకత్వాన్ని నేరుగా జిల్లా పోలీసులకు అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పనితీరుపై ఆరా తీస్తున్నారు. ఈ సందర్బంగా వరంగల్ జిల్లాలో పర్యటించారు డీజీపీ. సమీక్షలో భాగంగా ఈగిల్, సిఎస్బి, టిజి-స్పార్క్ , సిఐడి ఎస్పిలతో కలిసి వరంగల్ పోలీసుల పనితీరుపై విస్తృత సమీక్ష చేపట్టారు. సిపి శ్వేత నేర గణాంకాలను సమర్పించారు. మొత్తం నేరాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయని, ఇతర ప్రధాన నేరాలు అదుపులో ఉన్నాయని తెలిపారు. తాను ప్రధాన ఆర్థిక నేరాలు, పోక్సో, ఎస్సీ/ఎస్టీ కేసుల స్థితిని కూడా సమీక్షించారు.
వరంగల్లోని ప్రముఖ విద్యాసంస్థలు దేశ వ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షిస్తున్నందున, వలస కార్మికుల తాకిడి, కీలకమైన రైల్వే నెట్వర్క్ ఉన్నందున, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దొంగల బారి నుండి రక్షణ కల్పించేందుకు ప్రయాణికుల కదలికలపై నిఘాను ముమ్మరం చేయాలని ఆదేశించారు డీజీపీ. పనిచేయని సిసిటివి కెమెరాలను మార్చేందుకు ఒక ప్రత్యేక డ్రైవ్ను చేపట్టాలని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాలు , సైబర్ నేరాల దర్యాప్తు, క్షుణ్ణంగా నేరస్థల విశ్లేషణ వంటి నైపుణ్యాలను పెంపొందించు కోవాలని సూచించారు సీవీ ఆనంద్. జాతీయ రహదారులపై భద్రతను మెరుగు పరచాలని, బ్యూరోలు పంచుకున్న సూచనల మేరకు కీలక కార్యాచరణ అంశాలపై పని చేయాలని ఆదేశించారు.















