తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. తిరుమలలో ఈసారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి వివరాలు వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని అన్నారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు జరుగనున్నాయని వెల్లడించారు బీఆర్ నాయుడు.
మొదటి మూడు రోజులకు ఎలక్ట్రానిక్ లక్కీడిప్ ద్వారా టోకెన్లు కేటాయించడం జరిగిందని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా శ్రీవారి భక్తుడని, ఆయన చేసిన సూచనల మేరకు తాము ఈసారి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. భారీ ఎత్తున సామాన్య భక్తులకు ప్రయారిటీ ఇస్తున్నామని స్పష్టం చేశారు బీఆర్ నాయుడు.. మిగతా 7 రోజులు టోకెన్లు లేకుండానే సామాన్య భక్తులకు సర్వ దర్శనం ద్వారా వైకుంఠద్వార దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం అన్నారు. రద్దీ ప్రాంతాల్లో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.



















