అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమల ఏర్పాటు, అనుమతులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కేంద్ర ప్రతిపాదిత డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 విధానాలపై చర్చించారు. పరిశ్రమల ఏర్పాటులో వేగం, అనుమతుల్లో సులభతరం ఉండాలని, అనవసరపు పర్మిషన్ల నియంత్రణపై కూడా ప్రత్యకంగా ప్రస్తావించారు. ఇదిలా ఉండగా కేంద్రం రూపొందించిన ప్రతిపాదనలను సీఎం ముందు ఉంచారు స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్. స్టీల్ సెక్రటరీ ప్రతిపాదనలపై రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులతోనూ సీఎం చర్చించారు విస్తృతంగా .
800కు పైగా ఉన్న నిబంధనలను 100 లోపునకు తీసుకు రావాలని సీఎస్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పర్మిషన్లు, లైసెన్సులను సింగిల్ డిజిట్కు పరిమితం చేయాలని అన్నారు. ప్రజల భధ్రత, పర్యావరణం వంటి అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. వేధింపులు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. అటవీ చట్టాలను వీలైనంత మేరకు సరళీకరించాలని కేంద్ర బృందానికి సీఎం సూచించారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర నిబంధనలు పెట్టాలని ఆదేశించారు.
