హైదరాబాద్ : ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త , కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ మర్యాద పూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు సుబ్రమణియన్ ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు.
అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో జరిగిన ఈ కీలక సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విద్యుత్ రంగం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీఎస్టీ విభాగాల్లో నమూనా మూల్యాంకనం, జీఎస్టీలో పన్నుల అంచనా, తదితర అంశాలపై సుబ్రమణియన్ తో విస్తృతంగా చర్చించారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పర్చుకుని ప్రణాళికా బద్ధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంపై సూచనలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్బంగా కోరారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఇప్పటికే తాము ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను, హామీలను నెరవేర్చేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోందని, వీటిని పూర్తి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియ చేయాలని కోరారు సీఎం.
ఇదే క్రమంలో తమ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి పూర్తి వివరాలను ప్రముఖ ఆర్థిక వేత్త అర్వింద్ సుబ్రమణియన్ కు వివరించారు రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క.దీనిపై కూడా సానుకూలంగా స్పందించారు ఆర్థికవవేత్త.


















