హైదరాబాద్ : సర్ ఎన్నికల ప్రక్రియపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ చీఫ్ ఎన్. రామచందర్ రావు. సర్ ప్రక్రియకు సంబంధించి ఎఫ్ఆర్సీ చెల్దదని ఇప్పటికే ఈసీ స్పష్టం చేసిందన్నారు. ఇవాళ రామందర్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్’ ను ఓటర్ల నమోదుకు ఉపయోగించ కూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. అక్రమ వలసదారులతో సహా సరైన గుర్తింపు పత్రాలు లేని వారికి ఓటర్ల జాబితాలో చోటు కల్పించడానికి , బూటకపు ఓటర్ల నమోదుకు వీలు కల్పించే దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్సీని ప్రవేశ పెట్టిందని రాంచందర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై భారత ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఓటర్ల నమోదుకు ఎఫ్ఆర్సీలను ఉపయోగించడంపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సమయంలో నమోదు కోసం ఎఫ్ ఆర్ సీలను ఉపయోగించ కూడదని భారత ఎన్నికల సంఘం ఆదేశించిందని ఆయన పేర్కొన్నారు. ఎఫ్ ఆర్ సీ ద్వారా అక్రమ వలసదారులకు ఓటర్ల జాబితాలో వెనుక ద్వారం ద్వారా ప్రవేశం కల్పించేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నానికి ఎన్నికల సంఘం గట్టిగా అడ్డుకట్ట వేసిందని ఆయన అన్నారు. అక్రమ ఓటు బ్యాంకులకు ఆశ్రయం ఇవ్వడం, అక్రమంగా ఉన్నవారికి చట్టబద్ధత కల్పించే కొత్త మార్గాలను వెతకడం వంటి చర్యలను కాంగ్రెస్, బీఆర్ఎస్ , ఎంఐఎం పార్టీలు ఇకనైనా ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. జూలై 25న జారీ చేసిన GO MS నం. 172 ద్వారా ప్రవేశపెట్టిన ఎఫ్ ఆర్ సీ కేవలం రేషన్ కార్డుతో సమానం అని, సంక్షేమ పథకాలు , రాయితీ బియ్యం పొందడానికి మాత్రమే దీనిని ఉపయోగించ వచ్చని, ఓటర్ల జాబితా కోసం గుర్తింపు రుజువుగా దీనిని వాడకూడదని ఈసీ ఆదేశాల్లో పేర్కొన్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తెలిపారు.















