ఢిల్లీ : రిలయన్స్ పవర్ కంపెనీకి బిగ్ షాక్ తగిలింది. నకిలీ బ్యాంక్ గ్యారెంటీ కేసులో రిలయన్స్ పవర్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల కింద చార్జిషీట్ దాఖలు చేసింది. వ్యాపారవేత్త అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్ లిమిటెడ్ పై చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం తెలిపింది .టెండర్ను పొందడానికి రూ. 68 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారెంటీ జారీ చేయడంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో వ్యాపారవేత్త అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్ లిమిటెడ్ తో పాటు మరో 10 మందిపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు స్పష్టం చేసింది.
ఇక ప్రాసిక్యూషన్ ఫిర్యాదులో పేర్కొన్న ఇతర నిందితులలో మాజీ రిలయన్స్ పవర్ సీఎఫ్ఓ అశోక్ కుమార్ పాల్, రోసా పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్ (రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థలు), ఒడిశాకు చెందిన షెల్ కంపెనీ బిస్వాల్ ట్రేడ్లింక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సారథి బిస్వాల్, బయోథేన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ట్రేడ్ ఫైనాన్సింగ్ కన్సల్టెంట్ అమర్ నాథ్ దత్తా ఉన్నారు. రిలయన్స్ గ్రూప్ అధికారులకు ఇది నకిలీ బ్యాంక్ గ్యారెంటీ అని బాగా తెలుసునని దర్యాప్తులో తేలింది. రిలయన్స్ నుబెస్ లిమిటెడ్ L-2 బిడ్డర్గా ఉద్భవించినప్పటి నుండి, టెండర్ను కాపాడటానికి, రిలయన్స్ గ్రూప్ అధికారులు కోల్కతాలోని ఒక ఎస్బీఐ బ్రాంచ్ నుండి నకిలీ విదేశీ బ్యాంక్ గ్యారెంటీకి కొత్త ఎండార్స్మెంట్ను ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నించారని ఈడీ సంచలన ఆరోపణలు చేసింది.



















