Bhatti Vikramarka : హైదరాబాద్ – గత సాధారణ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్ అమలు చేసేందుకకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka). బీసీ రిజర్వేషన్లు పెంచడంతోపాటు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు పెంచి బీసీ సబ్ ప్లాన్ తీసుకువచ్చే దిశగా ఆలోచిస్తున్నామని చెప్పారు. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
Deputy CM Bhatti Vikramarka Key Comments
హైదరాబాదులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని బీసీ ప్రతినిధుల బృందం మహాత్మా జ్యోతిబా పూలే భవన్ లో భట్టి విక్రమార్కతో (Bhatti Vikramarka) భేటీ అయ్యారు, ఈ సందర్భంగా బీసీ డిమాండ్లపై సుదీర్ఘంగా జజుల శ్రీనివాస్ గౌడ్ తో చర్చించారు . మొదటగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి ప్రతి ఆర్థిక సంవత్సరం రూ. 20, 000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోని బీసీలకు కూడా చట్టబద్ధమైన సబ్ ప్లాన్ తీసుకు రావాలని కోరారు.
గత నాలుగు సంవత్సరాలుగా ఉన్న బీసీ విద్యార్థుల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని, హైదరాబాదులో ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కునే విధంగా మహాత్మ జ్యోతిబాపూలే నాలెడ్జ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ల సంఖ్యను పెంచాలని, ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచడంతోపాటు బీసీలకు నిధుల కేటాయింపులలో కూడా అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాదులో మహాత్మా జ్యోతిబాపూలే నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నామని ఆయన అన్నారు . బీసీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కమిట్ మెంట్ తో పనిచేస్తుందని అన్నారు. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహాలను లేవని, బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్నిశలు పని చేస్తుందని ఆయన తెలిపారు .
ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు దశల వారీగా చెల్లిస్తామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలను తీసుకుంటుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాంకూర్మ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి డి రమ, బిసి మేధావుల వేదిక నాయకులు ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ శ్రీనివాస్, బీసీ నేతలు నరేష్ ప్రజాపతి, జాజుల లింగం గౌడ్, వేముల నాదం గౌడ్, పానుగంటి విజయ్, జి నాగరాజు గౌడ్, సత్యం గౌడ్, ఇంద్రమ్ రజక, గౌతమ్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : TG High Court Fired on Sigachi Incident : సిగాచి ఘటనపై హైకోర్టు సీరియస్
















