తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన రెండోసారి కొలువు తీరాక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పూర్తి పారదర్శకత ఉండేలా చూశారు. ఈవో ఆదేశాల మేరకు టీటీడీ సేవల నాణ్యతను మరింత మెరుగు పరచడానికి ఉద్దేశించి భక్తుల నుండి విలువైన అభిప్రాయాన్ని సేకరించేందుకు వివిధ రకాల ఫీడ్బ్యాక్ సర్వేలను టీటీడీ ప్రారంభించింది.
రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు అభిప్రాయాలు సేకరించి మరింత మెరుగుప రిచేందుకు కృషి చేయాలని ఇప్పటికే సీఎం సూచించారు. ఈ మేరకు టీటీడీ ఐవీఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు సేకరిస్తోంది.
ఈ సర్వే ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవం, అన్న ప్రసాదం, కళ్యాణ కట్ట, శ్రీవారి ఆలయం, వసతి, లగేజ్ కౌంటర్, ప్రైవేట్ హోటళ్ల ధరలపై మొత్తం 17 ప్రశ్నలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేలా రూపొందించారు. తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్లను మొబైల్తో స్కాన్ చేస్తే (వాట్సాప్ నెం: 9399399399) టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు మొదలైనవి)ను ఎంచుకోవాలి.
అనంతరం, అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్ ను ఎంచుకుని సేవా ప్రమాణాన్ని ఉత్తమం, సగటు/మరింత మెరుగుదల అవసరం, లేదా బాగాలేదు గా రేటింగ్ చేయాల్సి ఉంటుంది. భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్లోడ్ చేయవచ్చు.
