తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో పేరు పొందిన ప్రముఖ పుణ్య క్షేత్రం కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయానికి తీపి కబురు చెప్పింది. ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొణిదలకు కొండగట్టులో ఉన్న ఆంజనేయ స్వామి అంటే వల్లమాలిన అభిమానం. ఆయన తన జనసేన పార్టీని స్థాపించేకంటే ముందు, ఆ తర్వాత జగన్ హయాంలో వారాహి అమ్మ వారి యాత్రకు శ్రీకారం చుట్టే సమయంలో కూడా పెద్ద ఎత్తున తన అనుచరగణంతో కొండగట్టుకు వెళ్లారు. అక్కడ అంజన్నను దర్శనం చేసుకున్నారు. పూజలు చేశారు. ఈ సందర్బంగా తనకు వెన్నంటి ఉండే ఒకే ఒక్క దేవుడు ఆంజనేయ స్వామి అని బహిరంగంగానే ప్రకటించారు.
ఇందులో భాగంగా తాను అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా కీలకమైన పదవిలో ఉన్నారు. దీంతో తాను ఆరాధించే, ప్రేమించే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ది చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇక్కడికి నిత్యం వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యం, బసను అందించే లక్ష్యంతో కొండగట్టులోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక వసతి సముదాయం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందు కోసం టీటీడీకి ప్రతిపాదనలు పంపించారు. పవన్ కళ్యాణ్ కొణిదల చేసిన అభ్యర్థన మేరకు టీటీడీ పాలక మండలి సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా టీటీడీ వెల్లడించింది.
