మెదక్ జిల్లా : బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఈ మేరకు ఎంపీ సీఎంకు వినతిపత్రం సమర్పించారు.. తెలంగాణ నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ ఆద్వర్యంలో నూతన ఆయిల్ పామ్ కర్మాగారంను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటనలో 8 ముఖ్యాంశాలతో సీఎంకు వినతి పత్రం ఇచ్చారు ఎంపీ.
గజ్వేల్ లో అసంపూర్తిగా ఉన్న రింగ్ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని కోరారు. మల్లన్న సాగర్ కింద దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలకు కాలువల ద్వారా నీళ్లు అందించాలన్నారు.
దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ కార్యాలయం మంజూరు చేయాలని సూచించారు. తపాస్ పల్లి రిజర్వాయర్ నుంచి కొండపాక మండలంలోని ఎనిమిది గ్రామాలకు నీళ్లు అందించాలని కోరారు ఎంపీ. 765 డిజి జాతీయ రహదారి హబ్సిపూర్ నుంచి దుబ్బాక అంబేద్కర్ విగ్రహం వరకు నాలుగు లైన్ల రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎనగుర్తి చౌరస్తా నుంచి బొప్పాపూర్ మీదుగా శిలాజీ నగర్ కు డబుల్ రోడ్డు మంజూరు చేయాలని కోరారు. కొండపాక మండల కేంద్రంలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు.
















