తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను 8వ తేదీ వరకు పూర్తి స్థాయిలో సర్వ దర్శనం చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను శుక్రవారం అదనపు ఈవో అధికారులతో కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆదనపు ఈవో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు నాలుగో రోజైన శుక్రవారం నుండి 8వ తేదీ వరకు పూర్తిగా సర్వ దర్శనానికి కేటాయించినట్లు తెలిపారు. జనవరి 1వ తేదీ సాయంత్రం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని, రాత్రి నుండి సర్వ దర్శనం భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించినట్లు చెప్పారు. శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసిందని స్పష్టం చేశారు వెంకయ్య చౌదరి.
టిటిడిలోని అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో భక్తులకు సేవలందిస్తున్నారని తెలిపారు. క్యూ లైన్ లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన సమయం, భక్తులు క్యూ క్యూలైన్లలోనికి నిర్దేశించిన ప్రవేశ మార్గాలను, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా తెలియ జేయస్తున్నట్లు చెప్పారు. అప్పటి వరకు భక్తులు, యాత్రికల వసతి సముదాయాలలో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు.



















