హైదరాబాద్ : హైదరాబాద్ లోని పలు కాలనీల్లో ప్రభుత్వ పరిధిలోని పార్కులు, ప్రజావసరాలకు కేటాయించిన స్థలాలను కాపాడాల్సిన కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ప్రజా వాణికి ఫిర్యాదు చేశారు. అసోసియేషన్ ప్రతినిధులుగా చెలామణి అవుతూ పార్కు స్థలం కొంత.. ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు గుట్టు చప్పుడు కాకుండా అమ్మేస్తున్నారని వాపోయారు. పార్కులు, రహదారులు, పాఠశాలల క్రీడాస్థలాలు, కుల సంఘాలకు ఇచ్చిన స్థలాలు ఇలా కబ్జాలకు ఏదీ అనర్హం కాదు అనేట్టు మాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద దాడులు, లేదంటే కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. స్థానిక అధికారులకు తెలిసినా పట్టించు కోవడం లేదని.. ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు ఉండడం లేదని పలువురు ఆరోపించారు.
ఇలా హైడ్రా ప్రజావాణికి మొత్తం 72 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. అన్నింటిని పరిశీలించి సంబంధిత అధికారులకు అప్పగించారు. మేడ్చల్ – మల్కాజగిరి జిల్లా మల్కాజిగిరి మండలం రాథాకృష్ణ హౌసింగ్ కాలనీ పేరిట దాదాపు 28 ఎకరాల్లో 355 ప్లాట్లతో లే ఔట్ వేశారని ఆరోపించారు. ఇందులో 600ల గజాలను పార్కుకోసం కేటాయించారని తెలిపారు. ఆ పార్కులో 136 గజాల స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. దీనిని అడ్డుకోకోపోతే మిగతా స్థలం కూడా కబ్జాకు గురి అవుతుందని.. వెంటనే హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేయాలని హైడ్రా ప్రజావాణిలో ఆ కాలనీ నివాసితులు ఫిర్యాదు చేశారు.

















