CM Revanth Reddy : హైదరాబాద్ : బంగాళాఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ముందస్తుగా అప్రమత్తం అయ్యింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఈ మేరకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం రాత్రి అత్యవసరంగా సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ రామకృష్ణ రావుకు స్పష్టం చేశారు. నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు సీఎం. రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ముందస్తుగా వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది సర్కార్ కు. దీంతో అన్ని శాఖలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు.
CM Revanth Reddy Comments
ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలెర్ట్ గా ఉండి పరిస్థితిని సమీక్షించాలని కోరారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అన్ని కాజ్ వేలను పరిశీలించాలని, రోడ్లపైకి వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ ను నిలిపి వేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వేలాడే వైర్లను తొలగించటంతో పాటు, ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు ఎ. రేవంత్ రెడ్డి. దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యా సంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే జనం రోడ్లపైకి రావాలని సూచించారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Also Read : ITR Filing Important Update : అక్టోబర్ 31 వరకు పన్ను ఆడిట్ నివేదికల గడువు పొడిగింపు – కర్ణాటక హైకోర్టు ఆదేశం
















