హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, తన సహచర మంత్రివర్గంతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు సైతం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ శాసన సభా సమావేశాలను భ్రష్టు పట్టిస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తన వ్యవహార శైలిని మార్చుకోవాలని సూచించారు. ఒకనాడు బీఆర్ఎస్ లో తన వెనుక నక్కి నక్కి ఉంటూ వచ్చిన రేవంత్ రెడ్డి గతం మరిచి పోయి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.
అసెంబ్లీలో “బడ్వే” లాంటి అసభ్య పదజాలాన్ని వాడిన రేవంత్ రెడ్డి పైనే మొదట అనర్హత వేటు వేయాలని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన కంపెనీ అవినీతికి పాల్పడిందని రెడ్ హ్యాండెడ్ గా ఆధారాలతో సహా దొరికి పోయిందన్నారు. ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికే ఇవాళ కౌశిక్ రెడ్డి అంశాన్ని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు హరీశ్ రావు. కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే ప్రభుత్వం అతను పై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి.కౌశిక్ రెడ్డిపై పెట్టినవన్నీ అక్రమ కేసులేనని కోర్టులే స్పష్టం చేశాయన్నారు. అందుకే ఆయనపై ఎన్ని కేసులు పెట్టిన కోర్టులు బెయిల్ ఇచ్చాయన్నారు.
ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాల్సింది కౌశిక్ రెడ్డిని కాదని, అసెంబ్లీలో అనాగరిక భాషలో మాట్లాడిన రేవంత్ రెడ్డిపైనని స్పష్టం చేశారు హరీశ్ రావు.
















