CM Revanth Reddy : హైదరాబాద్ – హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఇటీవల తక్కువ సమయంలో విపరీతమైన వర్షం కురవడం, పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్న ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
CM Revanth Reddy Visited
అమీర్పేట్, బుద్ధనగర్, మైత్రివనం, బాల్కంపేట తదితర ప్రాంతాల్లో వరద ముంపుతో ప్రభావిత కాలనీలను ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. బుద్ధనగర్లో వరద నీటి డ్రెయిన్ సిస్టమ్ను పరిశీలించి అక్కడే అధికారులకు తగిన సూచనలు చేశారు. బాల్కంపేట ముంపు ప్రభావిత ప్రాంతంలో తలెత్తుతున్న సమస్యలను హైడ్రా కమిషనర్, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. బుద్ధనగర్ ప్రాంతంలో కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందని గమనించారు ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆ కాలనీకి పక్కనే గంగూబాయి బస్తీకుంటను సందర్శించిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. బస్తీకుంటను కొంతమంది పూడ్చేసి పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని స్థానికులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలో ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అందుకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఇటీవల పలు సందర్భాల్లో వరద నీరు నిలిచిన మైత్రీవనం వద్ద పరిస్థితిని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అమీర్ పేట బుద్ధనగర్లో జశ్వంత్ అనే బాలుడితో ముఖ్యమంత్రి వివరాలు ఆరా తీశారు. బాలుడిని వెంట తీసుకుని ఆ ప్రాంతాన్ని కలియతిరిగారు. తాను 7 వ తరగతి చదువుతున్నానని, వరద నీరు ఇంట్లోకి వచ్చి పుస్తకాలు తడిసి పోయాయని ఆ బాలుడు వివరించారు. భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తానని బాలుడికి ధైర్యం చెప్పారు.
Also Read : Minister Rajnath Singh Sensational : భారత్ ను ఆపే శక్తి అమెరికాకు లేదు
















