హైదరాబాద్ : విధి నిర్వహణలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం తరఫున 1 కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రి వారి తల్లి, ఇతర కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే, గతేడాది విధి నిర్వహణలో దుండగుల చేతిలో కత్తిపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ఆర్థిక సహాయంగా 1 కోటి రూపాయల చెక్కును ప్రమోద భార్య ప్రణీతకు అందించారు. ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులకు ఆ చెక్కులను అందించారు.
ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా తాము కృషి చేస్తున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి. గతంలో ఏలిన బీఆర్ఎస్ పాలకులు రాష్ట్రాన్ని అందినంత మేర దోచుకున్నారని ఆరోపించారు. తప్పు చేసిన వారిని తప్పకుండా శిక్షిస్తామని ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులకు శిక్ష తప్పదన్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు వందలాది పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు.

















