ఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్టుండి ఆయన మంగళవారం శివాలయాల్లో కొనసాగుతున్న భక్తుల రద్దీపై ఆరా తీశారు. ఆయన అక్కడి నుంచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్బంగా శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేపట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ, సౌకర్యాలపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు ఇతర అధికారులతో ఢిల్లీ నుంచి రివ్యూ చేశారు. అధికారులు, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను, సౌకర్యాలను సమీక్షించారు. శివరాత్రి నాటికి శ్రీశైలంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు.
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, హోం మంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక శ్రద్దతో ఏర్పాట్లు, వసతులపై అధికారులతో పర్యవేక్షించాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, వసతి లభించేలా కార్యచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి చేరుకునే భక్తులకు ఇబ్బంది కలిగేలా, అగౌరపరిచేలా ఎవరూ వ్యవహరించ కూడదని వార్నింగ్ ఇచ్చారు. రోజు రోజుకూ దేవాలయాల్లో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
