CM Chandrababu : పాడేరు – ఆదివాసీలు అన్ని విధాలా అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టగా దాన్ని తాను కొనసాగిస్తున్నానని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు కల్పించేందుకు గతంలో తాము జీవో నెంబర్ 3 తీసుకొస్తే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఆ జీవోలు రద్దయ్యాయని, ప్రత్యామ్నాయ మార్గాల్లో గిరిజనులకు మేలు చేస్తామన్నారు. అల్లూరి జిల్లా పాడేరు మండలం వంజంగిలో శనివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) పాల్గొన్నారు. వంజంగిలో వనదేవత మోదకొండమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం గ్రామ సమీపంలో కాఫీ తోటలను పరిశీలించి, గిరిజన సంప్రదాయ వేడుకలను తిలకించారు. ఆదివాసీ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. టూరిజం అభివృద్ధిపై తీసుకుంటున్న చర్యలు, ప్రాజెక్టుల వివరాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
CM Chandrababu Key Comments
ఈ రోజు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. అంతర్జాతీయ గిరిజన దినోత్సవం…అన్నా చెల్లెళ్ల అనుబంధం చాటే రాఖీ పండుగ. ఇలాంటి పవిత్రమైన రోజున పాడేరులో ఇలా గిరిపుత్రులు మధ్యలో ఉండటం నాకు సంతోషాన్నిస్తోందని అన్నారు చంద్రబాబు నాయుడు (CM Chandrababu). పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనే లక్ష్యంతో కష్టపడుతున్నానని చెప్పారు. గతంలో పాడేరు రావాలనుకున్నా వాతావరణం అనుకూలించక రాలేక పోయానని వాపోయారు. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతం. ఇక్కడికి వస్తున్న సమయంలో కొండలు, పచ్చటి వాతావరణం చూశాను. మళ్లీ జన్మ ఉంటే ఇక్కడ పుట్టాలని ఉంది. విత్తన పండుగలు, సంక్రాంతి వరకూ ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. గత పాలకులు ఈ ప్రాంతాన్ని పట్టించుకోక పోవడంతో అనేక ఇబ్బందులు వచ్చాయన్నారు.
గిరిజనుల సంక్షేమంతో పాటు ఆ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు సీఎం. గతంలో ఐఎఎస్ అధికారులను ప్రాజెక్ట్ ఆఫీసర్లుగా నియమించి ఐటీడీఏలను బలోపేతం చేశాం. రాష్ట్రంలో ఎస్టీలు 28.32 లక్షలు కాగా అందులో సుమారు 8.41 లక్షలు గిరిజన కుటుంబాలు ఉన్నాయి. 3,77,051 మంది గిరిజనులకు ప్రతినెలా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇస్తున్నాం. పక్క రాష్ట్రాలు చత్తీస్గడ్, ఒడిశాలో ఎంత పెన్షన్ ఇస్తున్నారో ఒకసారి గమనించండి. గిరిజనులకు పింఛన్ల కోసమే ఏడాదికి రూ.1,595 కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రకటించారు.
Also Read : Guvvala Balaraju Alarming : బీజేపీలో చేరేందుకు గువ్వల ఫిక్స్


















