అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. అలాగే పారిశ్రామిక ప్రోత్సాహకాలను కూడా రూ.210 కోట్ల మేర విడుదల చేశామని తెలిపారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రకటించారు సభ సాక్షిగా. వాటిద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లు అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. 2047కు 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఏపీ తయారవుతుందని నమ్మకం తమకు ఉందన్నారు. విశాఖ ఐటీ, జీసీసీల కేంద్రంగా తయారవుతుందని ఇందులో సందేహం అక్కర్లేదన్నారు. ఎవరూ ఊహించనన్ని పెట్టుబడులు విశాఖకు వచ్చాయని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
అమరావతికి క్వాంటం లాంటి ఎకోసిస్టం వస్తోంది. తిరుపతిని కూడా స్పేస్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్సు పరిశ్రమలతో అభివృద్ధి చేస్తాం అన్నారు. గూగుల్, టాటా- టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీలు విశాఖకు వచ్చాయని తెలిపారు. ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు పరిశ్రమ వస్తోందని చెప్పారు. 20 నెలల్లోనే ప్రపంచంలోనే పేరున్న పరిశ్రమలు కంపెనీలు ఏపీకి వచ్చాయని అన్నారు. ఈ నెలలో ఆర్సెలార్ మిట్టల్, వచ్చే నెలలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేయబోతున్నాం అని ప్రకటించారు సీఎం. ఏఎం గ్రీన్ ద్వారా గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి కూడా శ్రీకారం చుట్టామని తెలిపారు. ఎన్టీపీసీ ద్వారా 1.85 లక్షల కోట్లతో గ్రీన్ ఎనర్జీ తయారీ కోసం కూడా ప్లాంట్ ఏర్పాటు చేయబోతోందని పేర్కొన్నారు. టాటా సంస్థ కూడా రూ.6 వేల కోట్ల పెట్టుబడులతో యూనిట్ ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. ఇలా ప్రముఖ సంస్థలన్నీ రాష్ట్రానికి పెట్టుబడులతో ముందుకు వచ్చాయన్నారు. భవిష్యత్తులో ఈ పెట్టుబడులను సుస్థిరం చేయడానికి పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు.

















