అమరావతి : కాకినాడలో చోటు చేసుకున్న ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శనివారం కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటన చోటు చేసుకుంది. దీనిపై సమీక్ష చేపట్టారు సీఎం. విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ప్రమాద ఘటన గురించి తెలియ చేశారు అధికారులు. దీంతో విజయనగరం నుంచే ఉన్నతాధికారులతో మాట్లాడారు సీఎం. ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీసిన సీఎం. ప్రమాదం జరిగిన సూర్య ఫైర్ వర్క్స్ లో 20 మంది వరకు పని చేస్తున్నారని వెల్లడించారు.
పెద్ద సంఖ్యలో బాణసంచా తయారీదారులు ప్రాణాలు కోల్పోవడం పై విచారం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా ప్రమాద ఘటన మరింత దిగ్భ్రాంతికరంగా ఉండడంతో మంత్రులను, ఉన్నతాధికారులను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. కాగా కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సమాచారం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు మంత్రి నారా లోకేష్. ఆయన విషయం తెలిసిన వెంటనే స్పందించారు. సహాయక చర్యల గురించి ఆరా తీశారు. పలువురు మృత్యువాత పడటం మాటలకు అందని విషాదం అని పేర్కొన్నారు. మృతులకు నివాళులు అర్పిస్తున్నాను. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటించారు.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.
















