CM Chandrababu : విశాఖపట్నం : వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలే కీలకమన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపుతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇవి ప్రధాన భూమిక పోషిస్తాయని స్పష్టం చేశారు. హార్టీకల్చర్ హబ్ గా రాయలసీమతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు పుష్కలంగా అవకాశాలున్నాయని అన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారులు ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు చేయాలని సీఎం సూచించారు. చిత్తూరు, అన్నమయ్య తదితర జిల్లాల్లో స్థానికంగా ఉన్న మ్యాంగో ప్రాసెసింగ్ పరిశ్రమల వల్లే రైతులకు ఎక్కువ ఇబ్బంది లేకుండా చూడగలిగామని అన్నారు. పొరుగున తమిళనాడు, కర్ణాటకలలో ఈ తరహా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు లేవన్నారు చంద్రబాబు నాయుడు (CM Chandrababu).
CM Chandrababu Key Comments
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు పూర్తి కావాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభించిన ప్రాంతాల్లో మినహా మిగతా నియోజకవర్గాల్లో 3 నెలల్లో ఈ పార్కులు అందుబాటులోకి రావాలన్నారు. ఈ పారిశ్రామిక పార్కులన్నీ బిజినెస్ సెంటర్లలా చేసి.. ఒక ఎకో సిస్టంను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులు, భూ యజమానుల్ని కూడా ఈ పారిశ్రామిక పార్కుల్లో భాగస్వాములను చేయాలని స్పష్టం చేశారు. తద్వారా వారికి ఆదాయం వచ్చేలా చేయాలని అన్నారు. అలాగే రాష్ట్రంలో మెగా, మీడియం స్థాయిలో పారిశ్రామిక పార్కులను నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు.
ఈ పారిశ్రామిక పార్కులకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లను అనుసంధానించటంతో పాటు వాటికి ప్రామాణిక మార్గదర్శకాలను నిర్దేశించాలన్నారు. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ఆర్టీఐహెచ్ ద్వారా జరిగే కార్యకలాపాలను సమీక్షించాలని సీఎం సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని ఆటోనగర్ లలో రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలకు తదుపరి అనుమతులు రాకపోవటంపై సమీక్షించిన సీఎం దీనికి తగిన కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఏపీకి పరిశ్రమలు రావటం ముఖ్యమన్న సీఎం.. ఇంధన ఉత్పత్తి, ఐటీ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, మైనింగ్ ఆధారిత వాల్యూ చైన్ పరిశ్రమల్లో పెట్టుబడులు రావాల్సి ఉందన్నారు.
అలాగే ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్, కో-వర్కింగ్ స్పేస్ లను ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు గత పాలకులు తిరుపతి వేంకటేశ్వరస్వామి ఏడుకొండల పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించారని.. కొండను ఆనుకుని హోటల్ నిర్మాణానికి స్థలం కేటాయించిందన్నారు. కూటమి అధికారంలోకి రాగానే భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయంగా స్థలం చూపామని అన్నారు. దీనిపై కొందరు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
Also Read : Supreme Court New Judges Interesting : కొలువు తీరిన కొత్త న్యాయమూర్తులు
