హైదరాబాద్ : రానున్న మరో రెండు దశాబ్దాల కాలంలో తెలంగాణను ప్రపంచ చిత్రపటంలో ఉన్నతస్థానంలో నిలబెట్టాలన్న సంకల్పంతో భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి రూపొందించే తెలంగాణ రైజిగ్ 2047 విధాన పత్రం డిసెంబర్ 6వ తేదీ లోపు పూర్తి కావాలని ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో దార్శనిక పత్రం తయారీ, ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
ఈ విధాన పత్రానికి సంబంధించి సోమ, మంగళవారాల్లో మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రతి అంశాన్ని చర్చించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు సీఎం.
అధ్యయనం చేసి క్రోడీకరించిన అంశాలను నివేదిక రూపంలో 2 వ తేదీ రాత్రి వరకు సమర్పించాలన్నారు. 3, 4 తేదీల్లో అన్ని శాఖలు ఇచ్చిన నివేదికలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , ప్రత్యేక కార్యదర్శి తో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పరిశీలించి అవసరమైన మార్పు చేర్పులతో తుది ప్రతిని సిద్ధం చేయాలని చెప్పారు.
6 వ తేదీ సాయంత్రం వరకు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ సంపూర్ణంగా సిద్ధం చేయాలని, అందుకు అనుగుణంగా విభాగాల అధికారులు దార్శనిక పత్రం రూపకల్పన కోసం పూర్తి సమయం వెచ్చించాలని సూచించారు. అలాగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు నిర్వహణలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు సీఎం.
















