ఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మంగళవారం తన పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ లతో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీడీపీకి చెందిన ఎంపీలు కూడా ఉన్నారు. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయం, అంతర్రాష్ట్ర వివాదాలు, పెండింగ్లో ఉన్న అంశాలతో పాటు, పరిష్కారంపైనా సవివరంగా చర్చించారు.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని సీఎం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ను కోరారు.
అంతే కాకుండా పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్మెంట్ చేయాలని సూచించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి కేంద్ర సర్కార్ కు పూర్తి నివేదిక అందించినట్లు ఈ సందర్బంగా చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్–IIకి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఫేజ్–IIలో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. వీటికి అదనంగా సుమారు రూ.32,000 కోట్ల నిధులు అవసరం అవుతాయని స్పష్టం చేశారు. జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ (వీడబ్ల్యుడీటీ) తుది నివేదిక గెజెట్లో ప్రచురించాలని సూచించారు సీఎం. నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు.

















