Telangana : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం మొదలవుతోంది. రాష్ట్రంలోని వరంగల్ మరియు ఆదిలాబాద్ జిల్లాల్లో రెండు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు కు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఇప్పటికే ప్రాథమిక కసరత్తును ప్రారంభించింది. బ్రౌన్ఫీల్డ్ కేటగిరీలో ఈ ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించినట్టు సమాచారం.
Telangana – మామునూర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి త్వరలో ప్రారంభం
వరంగల్ జిల్లా మామునూర్లో ఉన్న పాత ఎయిర్స్ట్రిప్ను ఆధునిక మౌలిక వసతులతో పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై AAI ఈ ప్రాజెక్టును పెద్ద విమానాల రాకపోకలకు అనుకూలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా A320, B737 తరహా ప్రయాణికుల విమానాలతో పాటు కార్గో విమానాల కూడా సౌకర్యంగా ల్యాండింగ్ చేసుకునేలా మౌలిక సదుపాయాలు రూపొందించనున్నారు.
భూసేకరణకు నిధుల విడుదల
ఈ రెండు విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసినట్టు తెలుస్తోంది. నిర్మాణ పనులు ఈ ఏడాది చివరినాటికి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు సుమారు రెండు సంవత్సరాలు పడే అవకాశముంది.
ఆదిలాబాద్లో ఎయిర్ఫోర్స్ అనుమతులు
ఆదిలాబాద్ జిల్లాలో బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి భారత వాయుసేన నుంచి ఇప్పటికే అనుమతులు లభించాయి. అక్కడ ఇప్పటికే వాయుసేనకు చెందిన 362 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. మిగిలిన అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు విమానాశ్రయాలను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టగా, కేంద్ర ప్రభుత్వం 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం.
కేంద్ర అనుమతులతో ముందుకు సాగుతున్న ప్రాజెక్టు
మామునూర్ విమానాశ్రయానికి కేంద్రం ఇటీవలే అనుమతిని మంజూరు చేసింది. పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు ఈ విషయాన్ని 2025 మార్చిలో ప్రకటించారు. విమానాశ్రయ నిర్మాణానికి రన్వే, టెర్మినల్ భవనం, ఇతర మౌలిక వసతుల కలిపి 500 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమని ఆయన వెల్లడించారు.
మరిన్ని ప్రాజెక్టుల సన్నాహాలు
వరంగల్ మరియు ఆదిలాబాద్ మాత్రమే కాకుండా, రామగుండం మరియు నిజామాబాద్ జిల్లాల్లో కూడా విమానాశ్రయాల ఏర్పాటు కోసం ప్రాథమిక సర్వేలు, కసరత్తులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్క శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే పూర్తిస్థాయిలో సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రయాణదూరం తగ్గించడంతో పాటు, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడేలా కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి కృషి చేస్తోంది.
తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని పలు మార్లు తీసుకెళ్లగా, కేంద్ర పౌర విమానయాన శాఖ సహకరించే వైఖరిని కనబరుస్తోంది. ఈ అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లభించే అవకాశముంది.
Also Read : India Forex Reserves Growth : ఆల్ టైమ్ హైకి భారత ఫారెక్స్ నిల్వలు



















