ముంబై : అంబానీకి కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త అనిల్ అంబానీతో పాటు ఆయనకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాజాగా మరో కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఆయన ఎక్కడికీ వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా భారతీయ అత్యంత నమ్మకమైన ప్రభుత్వ రంగ సంస్థ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కి ఏకంగా రూ. 3,750 కోట్ల నష్టం చేకూర్చినట్లు సదరు సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదిలా ఉండగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని ఛైర్మన్ అనిల్ అంబానీతో పాటు గుర్తు తెలియని ప్రభుత్వ ఉద్యోగులు ,ఇతరులపై కొత్త కేసు నమోదు చేసింది. ఫిర్యాదు ప్రకారం, ఈ కేసు LICకి ₹3,750 కోట్ల అక్రమ నష్టం వాటిల్లిందనే ఆరోపణకు సంబంధించినది. ఇది ఆర్థిక అవకతవకలు , ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అవకాశంపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. పరిశీలనలో ఉన్న లావాదేవీలకు సహకరించిన అధికారులతో సహా, ఇందులో ప్రమేయం ఉన్న వ్యక్తులందరి పాత్రపై సీబీఐ దర్యాప్తు చేసే అవకాశం ఉంది.



















