చెన్నై : సీఎం విజయ్ తల్లి శోభపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీవీకే పార్టీ ప్రతినిధులు, శ్రేణులు. ఇంట్లో తండ్రి ఎక్కడున్నారో తెలియనప్పుడు… ఆ విషయాన్ని తెలుసుకోవడానికి తల్లిని అడగాలి అని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అవసరం లేకపోయినప్పటికీ, ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన విజయ్ పేరును ప్రస్తావించి ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత విమర్శల స్థాయిని దాటి మాట్లాడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయనను అరెస్టు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
విధాన పరమైన విమర్శలు చేయడం మానేసి, ఒకరి తల్లిని లక్ష్యంగా చేసుకోవడం అత్యంత ఖండించదగిన చర్య అని పేర్కొన్నారు పలువురు ప్రముఖులు. బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామలై, నటి ఖుష్బూ సుందర్ కూడా దీనిని ఖండించారు, ఇవి 30-40 ఏళ్ల నాటి ‘బురద జల్లే’ రాజకీయాలని పేర్కొన్నారు. తరువాత, తన మాటలను వక్రీకరించారని చెబుతూ నాగేంద్రన్ కొంతవరకు క్షమాపణ ధోరణిలో వివరణ ఇచ్చారు. కానీ ఎవరూ దానిని పట్టించుకోవడం లేదు. తక్షణమే నైనార్ నాగేంద్రన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా విమర్శలు చేయాలని అనుకుంటే ఆధారాలతో సహా మాట్లాడాలని హితవు పలికారు.
















