తిరుపతి : బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో టిటిడి ఆలయం నిర్మించేందుకు బీహార్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆ రాష్ట్ర సర్కార్ కు ధన్యావాదాలు తెలిపారు. పాట్నాలోని మోకామా ఖాస్ ప్రాంతంలో 10.11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతయ అమృత్ ఈ మేరకు టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడుకు లేఖ రాశారు. సదరు స్థలంలో టిటిడి ఆలయాన్ని నిర్మించేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. పాట్నాలో టిటిడి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించడంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హెచ్ ఆర్డీ మంత్రి నారా లోకేష్ అభినందించిందినట్లు ఛైర్మన్ చెప్పారు.
సదరు భూమిని 99 సంవత్సరాల పాటు రూ. 1 టోకెన్ లీజ్ రెంట్ తో ఇవ్వాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీహార్ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టిటిడి ఆలయాన్ని నిర్మిస్తామని టిటిడి ఛైర్మెన్ వెల్లడించారు. ఈ మహత్తరమైన నిర్ణయంతో బీహార్ రాష్ట్రంలో టిటిడి ధార్మిక కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఎంవోయూ చేసుకునేందుకు బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ ను అధికారికంగా నియమించిందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ తో టిటిడి ప్రతినిధులు త్వరలో సంప్రదింపులు చేసి, టిటిడి ఆలయ నిర్మాణానికి సంబంధించిన అవసరమైన అన్ని చర్యలు చేపడుతామన్నారు. బీహార్ ప్రభుత్వ సహకారం, దూరదృష్టికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.



















