ములుగు జిల్లా : సైబర్ నేరాలపై ప్రజలకు తప్పనిసరిగా కల్పించాలని పోలీసులకు స్పష్టం చేశారు డీజీపీ సీవీ ఆనంద్. 5వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ను సందర్శించారు. ఈ సందర్బంగా పోలీసుల పనితీరుపై ఆరా తీశారు. తలెత్తుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు బెటాలియన్ పోలీసింగ్ను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని డీజీపీ నొక్కి చెప్పారు. సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, ఆన్లైన్ బెట్టింగ్పై ముఖ్యంగా యువతలో మరింత అవగాహన కల్పించాలని డీజీపీ స్పష్టం చేశారు. కమ్యూనిటీ ఔట్రీచ్ ద్వారా నివారణ పోలీసింగ్ను ప్రోత్సహించారు.
నిరంతర శిక్షణ, కఠినమైన క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, కార్యాచరణ సంసిద్ధత ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. అత్యవసర పరిస్థితులు, ఇతర క్లిష్ట సందర్భాలకు సమర్థవంతంగా స్పందించేందుకు బెటాలియన్ సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని డీజీపీ పేర్కొన్నారు. బెటాలియన్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచాలని, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలీసింగ్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా ఉపయోగించు కోవాలని, ఆధునిక పోలీసింగ్ అవసరాలకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
సిబ్బందితో జరిపిన సంభాషణలో డీజీపీ వారి సమస్యలను, అవసరాలను విన్నారు. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు. బెటాలియన్ సమగ్ర అభివృద్ధికి, దాని సిబ్బంది సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బెటాలియన్లు) సంజయ్ కుమార్ జైన్, మల్టీ జోన్-1 ఇన్స్పెక్టర్ జనరల్ చంద్ర శేఖర్ రెడ్డి, ములుగు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనన్ భట్, 4వ బెటాలియన్ కమాండెంట్ శివ ప్రసాద్ రెడ్డి, 5వ బెటాలియన్ ఇన్చార్జ్ కమాండెంట్ సీతార, అసిస్టెంట్ కమాండెంట్ కృష్ణ ప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు , ఇతర బెటాలియన్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.















