హైదరాబాద్ : హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది. లిటిగేషన్ భూములు, వివాదాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇలా వివరాలు తెలుసు కోవడం అక్కడ కబ్జాలకు పాల్పడడం బడాబాబులకు పరిపాటిగా మారింది. కేసులు, వివాదాలంటూ దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా జాగ్రత్త పడడం, తర్వాత వాటిని గుట్టు చప్పుడు కాకుండా సొంతం చేసుకోవడం జరిగిపోతోందంటూ పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారుల పక్కనే ఉన్న ప్లాట్లు కొనడం, తర్వాత ఇష్టానుసారం జరిగి నిర్మాణాలు చేపట్టడంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎల్ ఆర్ ఎస్ లేకపోవడంతో అలా కబ్జా చేసిన భూములను సొంతం చేసుకోలేక పోతున్నారు కాని.. లేని పక్షంలో ఖాళీ స్థలాలు మిగిలేవి కాదని పలువురు పేర్కొన్నారు.
కబ్జాలకు ఏది అనర్హం అనేట్టు చెరువులను, నాలాలు, రహదారులను కూడా వదలడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. కాగా హైడ్రా ప్రజావాణికి 47 ఫిర్యాదులందాయి. వీటిని హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య పరిశీలించారు. పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా గండి మైసమ్మ మండలం, బహదూర్ పల్లి విలేజ్లోని సర్వే నంబరు 227లో దాదాపు 353 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని ఓ కంపెనీ వారితో పాటు సొసైటీగా ఏర్పడిన వారు కబ్జా చేశారంటూ గతంలో అక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్న ఓ వ్యక్తి హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గతంలో జాయింట్ కలెక్టర్ కూడా దీనిని ప్రభుత్వ భూమిగానే పేర్కొనగా.. హైకోర్టు మళ్లీ సర్వే చేయాలని ఆదేశించడంతో గత నెల మరోసారి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ జాయింట్ కలెక్టర్ హైకోర్టుకు నివేదించారు.















