ముంబై : ప్రముఖ నటి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సీరియస్ అయ్యారు. ఆమె తనను ట్రోల్ చేస్తున్న వారి పట్ల, అసభ్య కామెంట్స్ , వీడియోలు పోస్టులతో ఇబ్బందికి గురి చేస్తున్న ఆకతాయిలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే తను హైదరాబాద్ లోని సైబర్ క్రైం ఆఫీసుకు స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేసింది. తనను మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ వాపోయింది రేణు దేశాయ్. సోషల్ మీడియా వేదికగా చేసుకుని రెచ్చి పోతున్న వారిని గుర్తించి , వారి వివరాలు పోలీసులకు అందజేసింది. దీంతో చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.
ఈ సందర్బంగా రేణు దేశాయ్ స్వయంగా వీడియో సందేశం ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా తనను అసభ్య పదజాలంతో దూషించడంపై తీవ్రంగా స్పందించారు. తన గురించి తప్పుగా కామెంట్స్ పెట్టిన ఆరుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయించానని చెప్పారు. సామాజిక మాధ్యమాలలో ఫేమ్ కావాలని, ఫాలోవర్స్ పెంచు కోవడం కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేయడం, మరొకరిపై అసభ్యకరంగా వీడియోలు, కామెంట్లు పెట్టడం తప్పని పేర్కొన్నారు. ఇలాంటి వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారని హెచ్చరించారు, కుటుంబ సభ్యులకు, పని చేసే ఆఫీస్లలోనూ సదరు వ్యక్తి గురించి చెబుతామని పేర్కొన్నారు నటి రేణు దేశాయ్. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.



















