అమరావతి : ఏపీ రాష్ట్రం మరో కీలక ఒప్పందం చేసుకుంది. మంగళవారం జల్ జీవన్ మిషన్ 2.0పై భారత ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది కూటమి ప్రభుత్వం. ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖలో సంతకాలు చేశారు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు. పల్లెల్లో ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో జేజేఎం 2.0ను రూపొందించింది కేంద్రం. ఢిల్లీలో జరిగిన ఎంవోయూ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, క్యాంప్ కార్యాలయం నుంచి జూమ్ ద్వారా హాజరయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వర్చువల్ గా హాజరయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. 2028 డిసెంబర్ నాటికి ‘హర్ ఘర్ జల్’ సాకారం చేసేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఎంఓయూ చేసుకున్నాయి.
ఇదిలా ఉండగా జేజేఎంను 2028 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సేవల అందజేత, ప్రజల భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. జల్ జీవన్ మిషన్ కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ ఇంటికి సురక్షిత, స్థిరమైన తాగు నీటిని అందించాలనేది తమ లక్ష్యమని చెప్పారు సీఎం చంద్రబాబు. ఎన్నికల హామీల్లో ఇది కూడా ఒకటని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని పేర్కొన్నారు.
