Heavy Rains : అమరావతి – బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 3.1 – 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో భారీ ఎత్తున వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వర్షాలే. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రాబోయే 48 గంటల పాటు భారీగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఇదిలా ఉండగా పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా కోస్తాంధ్రలో పలుచోట్ల అతిభారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి.
AP Heavy Rains Viral
గంటకు 40 -50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలతో పాటు మత్స్య కారులు బయటకు రావద్దంటూ కోరారు మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ జైన్.లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు కూడా మొబైల్స్ కు అలర్ట్ గా ఉండాలని మెస్సేజ్ లు కూడా పంపించామన్నారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల నేపధ్యంలో ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు,హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు.
అల్ప పీడనం కారణంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా మద్దిపాడులో 93 మిమీ, కాకినాడ జిల్లా కోట నందూరులో 76 మిమీ, సామర్లకోటలో 72.2 మిమీ,అల్లూరి జిల్లా కరిముక్కిపుట్టిలో 68 మిమీ, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 59.5 మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైందన్నారు.
Also Read : Binod Chaudhary Interesting Comments : నేపాల్ అత్యంత ధనవంతుడి ఆసక్తికర వ్యాఖ్యలు
















