AP : అమరావతి – వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది ఏపీ (AP) విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్. మరికొన్ని గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం కారణంగా ఇవాళ శ్రీకాకుళం నుండి ఏలూరు జిల్లా వరకు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
AP Rains Update
మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు ప్రఖర్ జైన్. వర్షాల కారణంగా ముందు జాగ్రత్తగా చేపల వేటకు వెళ్ల వద్దంటూ మత్స్యకారులకు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్. ఇదిలా ఉండగా స్వల్పంగా గోదావరి వరద ప్రవాహం తగ్గు ముఖం పట్టిందన్నారు. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.78 లక్షల క్యూసెక్కులకు చేరుకుందన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది ప్రవాహం 3.42 లక్షల క్యూసెక్కులుగా ఉందని పేర్కొన్నారు ప్రఖర్ జైన్. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read : Mohammad Azharuddin Sensational : మొహమ్మద్ అజహరుద్దీన్ మంత్రి అవుతారా..?
















