అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. తన హయాంలో ఏపీలో సాగు నీటి రంగాన్ని కావాలని నిర్వీర్యం చేశాడని ఆరోపించారు. కానీ కూటమి సర్కార్ వచ్చాక నీటి పారుదల రంగానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2014-19 మధ్య రూ.68 వేల కోట్లు సాగునీటి రంగానికి ఖర్చు చేశాం అన్నారు సీఎం. 2024 నుంచి రెండేళ్లలో రూ.24 వేల కోట్లు ఖర్చు పెట్టాం. గత పాలకులు అన్నమయ్య డ్యామ్ కొట్టుకు పోయినా పట్టించు కోలేదన్నారు. గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకు పోయినా మాట్లాడలేదు. ప్రాజెక్టుల మరమ్మతులకు పైసా ఇవ్వలేదు, గ్రీజు కూడా పూయలేదు. తుంగభద్ర డ్యామ్ కు కొత్త గేట్లను ఏర్పాటు చేయించాం. నిన్న ధవళేశ్వరం బ్యారేజికి కూడా రూ.152 కోట్లుతో కొత్త గేట్లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించాం.
2014-19లో పోలవరం ప్రాజెక్టులో 72 శాతం పనులు పూర్తి చేశాం. గడచిన రెండేళ్లలో ప్రాజెక్టును 89 శాతం మేర పూర్తి చేశాం. కానీ 2019-24 మధ్య కనీసం 2 శాతం కూడా పనులు చేయలేదు. పూర్తి నిర్లక్ష్యంతో డయాఫ్రామ్ వాల్ కూడా కొట్టుకు పోయేలా చేశారు. అతి ముఖ్యమైన ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చేయటం దేశ ద్రోహం, రాష్ట్ర ద్రోహం. ప్రాజెక్టులను గాలికి వదిలేసిన గత పాలకులు రాష్ట్ర రైతులకు ద్రోహం చేశారు. ఇప్పుడు అమరావతిని కూడా అద్బుతమైన నగరంగా నిర్మిస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారు. ప్రతిపక్షంలోని కొందరు రైతుల్ని రెచ్చగొట్టి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం.















